101 మంది లబ్ధిదారులకు రూ.61.72 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు, జూన్ 3: నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిలుస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 101 మంది లబ్ధిదారులకు రూ.61.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజల వైద్య అవసరాలకు అండగా నిలుస్తోందన్నారు. ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య ఖర్చుల భారం తగ్గి అనేక కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయని తెలిపారు.
నూజివీడు నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల్లో రూ.14.50 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని మంత్రి వెల్లడించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.325 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిర్వీర్యమైందని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయాలని కోరారు.
కార్యక్రమంలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.