గంపలగూడెంలో సీఎం చంద్రబాబుకు అంగన్వాడీల పాలాభిషేకం
గంపలగూడెంలో సీఎం చంద్రబాబుకు అంగన్వాడీల పాలాభిషేకం
గంపలగూడెం, జూలై 18: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో శనివారం తెలుగు నాడు అంగన్వాడి యూనియన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
జీవో నంబర్ 15 ద్వారా అంగన్వాడి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు 'తల్లికి వందనం' పథకం వర్తింపజేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో విజయవాడ పార్లమెంటు తెలుగు నాడు అంగన్వాడి ట్రేడ్ యూనియన్ నాయకురాలు గోల్లపూడి నాగమల్లిక మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అంగన్వాడి సిబ్బందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులకు తెలుగు నాడు యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు నాడు అంగన్వాడి యూనియన్ నాయకురాలు వై. ముని లక్ష్మి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఇటీవల మినీ అంగన్వాడి కేంద్రాలను ప్రధాన అంగన్వాడి కేంద్రాలుగా మార్చడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలకు ఎల్పీజీపై ఆధారపడకుండా వంట చేసుకునేందుకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేసినట్లు వివరించారు.
జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ అంగన్వాడి సిబ్బందికి అండగా ఉంటుందని, చిన్నారులకు అంగన్వాడి కార్యకర్తలే ప్రథమ గురువులని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు రేగళ్ల వీరారెడ్డి, బూరుగు నారాయణ, వేముల బాలయ్య, కాజా రవి, భరత్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.