ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాఠశాల ప్రాంగణాన్ని స్వయంగా శుభ్రం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాఠశాల ప్రాంగణాన్ని స్వయంగా శుభ్రం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/ఆగిరిపల్లి, జూలై 18: ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, పరిశుభ్రతను ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల "బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, ఘనవ్యర్థాల నిర్వహణ నియమాలు, పరిశుభ్రతపై అవగాహన" అనే అంశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి చీపురును చేతబట్టి విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించి, స్వయంగా చేతులు శుభ్రం చేయించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, మొక్కలు నాటి, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
మంత్రి మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా పాల్గొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు.
పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వ్యాధులు వ్యాపించి ప్రజలు ఆరోగ్యపరంగానే కాక ఆర్థికంగానూ నష్టపోతారని మంత్రి పేర్కొన్నారు. వ్యాధుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు.
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కేవలం పరిశుభ్రత కార్యక్రమం కాదని, రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా నడిపించే ప్రజా ఉద్యమమని వివరించారు. చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పచ్చదనాన్ని పెంపొందించడం, పరిశుభ్రతపై అవగాహన పెంచడం వంటి చర్యలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని, ప్రతి పౌరుడు పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకొని ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని మంత్రి పిలుపునిచ్చారు.