విద్యార్థినులకు రక్షణగా పోలీస్ అక్క
విద్యార్థినులకు రక్షణగా ‘పోలీస్ అక్క’
నల్గొండ జిల్లా ప్రతినిధి, జూలై 18: మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థినులు నిర్భయంగా చదువుకునేలా భద్రతా వాతావరణం కల్పించడమే పోలీస్ అక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మహిళా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం పాఠశాలలు, కళాశాలల్లో మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆకతాయిల వేధింపులు, ఈవ్టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినా, అనుమానాస్పద సంఘటనలు ఎదురైనా భయపడకుండా వెంటనే డయల్-100, షీ టీమ్స్ (She Teams) లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. మహిళల రక్షణ చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ కార్యక్రమ లక్ష్యమని మహిళా పోలీసులు పేర్కొన్నారు.