రమణమూర్తిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి
రమణమూర్తిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి
మంచిర్యాలలో ప్రజాసంఘాల నిరసన ప్రదర్శన
మంచిర్యాల: జై భారత్ వ్యవస్థాపకులు, హిందుస్థానీ గోరక్షా సమితి కన్వీనర్ రమణమూర్తిపై హైదరాబాద్లో టీవీ చర్చ జరుగుతుండగా అకారణంగా దాడి చేసిన కశ్యపరెడ్డిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారు ప్లకార్డులు చేతబూని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అయోధ్య వ్యవహారంలో జరుగుతున్న అవినీతిపై ఒక టీవీ ఛానల్ చర్చలో రమణమూర్తి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, దురుద్దేశంతోనే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. హిందూ పరిరక్షణ సమితి బస్సు యాత్ర ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాలను సందర్శించడంతో పాటు, తిరుపతిలో అన్నమయ్య విగ్రహ ఏర్పాటుకు రమణమూర్తి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేసిన ఆయనపై దాడి చేసి అవమానించడం మనువాద, కులోన్మాద చర్య అని మండిపడ్డారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించడానికే ఇటువంటి ఉన్మాద రాజకీయాలు చేస్తున్నారని వారు విమర్శించారు.
దాడి జరిగి నాలుగు రోజులైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని నాయకులు పేర్కొన్నారు. సర్వమత సామరస్యం విలసిల్లే తెలంగాణ గడ్డపై ఇలాంటి విచ్ఛిన్నకర ధోరణులకు స్థానం లేదని స్పష్టం చేశారు. హిందూమతంలో నెలకొన్న సామరస్య సాంప్రదాయాలపై జరుగుతున్న దాడులను దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి డూర్కె మోహన్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, బీసీ సంఘాల జాతీయ వేదిక నాయకులు గుమ్ముల శ్రీనివాస్, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ మోతె రామదాసు, జై భారత్ కమిటీ జిల్లా నాయకులు మనస్పూరి రమేష్, మేతరి లక్ష్మినారాయణ, సామాజిక ఉద్యమకారులు కైలాసం, రమేష్ తదితరులు పాల్గొన్నారు