పీజీఆర్ఎస్పై ప్రజా చైతన్య వేదిక హెచ్చరిక
పీజీఆర్ఎస్పై ప్రజా చైతన్య వేదిక హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉన్న పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ–స్పందన) ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా, నామమాత్రపు ఆన్లైన్ ప్రక్రియగా మారిందని ప్రజా చైతన్య వేదిక తరఫున జెరిపిటి వీరాంజనేయులు విమర్శించారు.
ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున విడుదల చేసిన ప్రకటనలో, ప్రజలు తమ సమస్యలు, అన్యాయాలు, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయం కోసం పీజీఆర్ఎస్ను ఆశ్రయిస్తున్నప్పటికీ, అనేక ఫిర్యాదులు వాస్తవంగా పరిష్కారం కాకుండానే "పరిష్కరించబడింది"గా నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
కొంతమంది అధికారులు ఫిర్యాదులను లోతుగా పరిశీలించకుండా కేవలం ప్రక్రియ పూర్తిచేయడానికే పరిమితమవుతున్నారని, దీంతో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు న్యాయం అందించాల్సిన వ్యవస్థే అసంతృప్తి, అవమానం, మానసిక వేదనకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పీజీఆర్ఎస్ ద్వారా ప్రజలకు లభిస్తున్నది వాస్తవ పరిష్కారం కాదని, గణాంకాల కోసం మాత్రమే ఫిర్యాదులను మూసివేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోందని పేర్కొన్నారు. కాగితాలపై సమస్యలను పరిష్కరించినట్లు నమోదు చేయడం వల్ల ప్రజల అసలు సమస్యలు తీరవని, అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఈ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.
పీజీఆర్ఎస్ వ్యవస్థను తక్షణమే పునర్వ్యవస్థీకరించి ప్రజలకు నిజమైన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించి, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపే విధంగా మార్పులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
"ప్రజల న్యాయం ఫైళ్లలో కాదు... వాస్తవ పరిష్కారంలో ఉండాలి" అని జెరిపిటి వీరాంజనేయులు పేర్కొన్నారు.