116 ఏళ్ల వయస్సులో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలు.. ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ
తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ, శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమెకు టీటీడీ సోమవారం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది.
నవనీతమ్మ కాలినడకన తిరుమలకు వెళ్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమె భక్తిని పలువురు కొనియాడారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు కూడా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో స్పందిస్తూ, భక్తికి వయస్సు అడ్డుకాదని, శ్రీవారిపై ఉన్న విశ్వాసానికి నవనీతమ్మ నిదర్శనమని పేర్కొన్నారు.
టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, చెన్నైకు చెందిన నవనీతమ్మను గుర్తించి ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించారు. అనంతరం సోమవారం ఉదయం నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. టీటీడీ సిబ్బంది బయోమెట్రిక్ కేంద్రం నుంచి దర్శనం వరకు ప్రత్యేకంగా వెంట ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు.
తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, వృద్ధ భక్తురాలికి పట్టువస్త్రం కప్పి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ, శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ అధికారులు తమ కుటుంబానికి గొప్ప దర్శన భాగ్యాన్ని కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.