పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకే 'సర్' కార్యక్రమం ఓటరు నమోదు అధికారి శారదా దేవి..
తిరుపతి | NTODAY NEWS
167-తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఓటరు నమోదు అధికారి (ERO) శారదా దేవి తెలిపారు.
సోమవారం ఎస్.టి.వి నగర్, ఎస్.జి.ఎస్. కళాశాల పరిసరాలు, ఆటోనగర్, ముత్యాలరెడ్డిపల్లి, 12, 13వ వార్డు సచివాలయ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, ఎన్యూమరేషన్ ఫారాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 2002 తర్వాత ఈ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొంటూ, పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరిన శారదాదేవి, అందించిన ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా సంబంధిత సిబ్బందికి అందజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈవోలు మహేష్, లలిత, స్వర్ణ, వార్డు కార్యదర్శులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తదితరులు పాల్గొన్నారు.