పెండింగ్ ఇంజనీరింగ్ పనులు వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
మదనపల్లి | NTODAY NEWS
జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం మదనపల్లి కలెక్టరేట్లోని కోర్టు హాలులో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్), ఇరిగేషన్, ఉపాధి హామీ, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ తదితర ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంకా ప్రారంభం కాని (Not Started) పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి స్థితిగతులను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, బీటీ మెటీరియల్ సరఫరాలో జాప్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలను ప్రాధాన్యత ఆధారంగా వర్గీకరించి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్, 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాల భవనాలు, రాయచోటిలో వన్ స్టాప్ సెంటర్, మదనపల్లిలో ప్రతిపాదిత జిల్లా పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ (DPRC) భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. డీపీఆర్సీ భవనంలో సుమారు 200 మందికి సరిపడే సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
గ్రామీణ నీటి సరఫరా శాఖ పనులపై సమీక్షిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను ఆగస్టు నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేపట్టాలని, నీటి రవాణాను ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు.
ఇరిగేషన్ శాఖ చేపట్టిన జలధార–100 రోజుల కార్యక్రమం కింద అన్ని పనులను ఆగస్టు 7లోగా పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్, ఈ నెల 8లోగా అన్ని ఒప్పందాలు పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. కరువు ప్రభావిత మండలాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
ఉపాధి హామీ పథకం కింద మదనపల్లి మండలంలో కొనసాగుతున్న 29 సప్లై ఛానల్ పనులను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.