పెనుగొలనులో ఘనంగా నారదగిరి లక్ష్మణదాసు 170వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ప్రముఖ వాగ్గేయకారుడు, కవి, కీర్తనకారుడు నారదగిరి లక్ష్మణదాసు 170వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ నారదగిరి లక్ష్మణదాసు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో 1856 సెప్టెంబర్ 15న జన్మించారని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆయన పరమ భక్తుడని పేర్కొన్నారు. తన స్వగ్రామమైన వట్టెంలో అప్పట్లో వేంకటేశ్వర స్వామి ఆలయం లేకపోవడంతో కాలినడకన తిరుపతికి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి వట్టెం గ్రామంలో ప్రతిష్ఠించినట్లు వివరించారు.
తన ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిపై లక్ష్మణదాసు వందలాది కీర్తనలు రచించారని వక్తలు తెలిపారు. ప్రస్తుతం ఆయన రచించిన సుమారు 200 కీర్తనలు, 50 మంగళహారతులు, కొన్ని పద్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన రచనా శైలి సరళమైన జానపద బాణీలతో సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే విధంగా భక్తిభావంతో సాగేదని వివరించారు. ఆయన రచనల్లో భక్తిరసంతో పాటు ఆధ్యాత్మిక పరిపూర్ణత కూడా స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.
లక్ష్మణదాసు రచనలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజలకు సులభంగా చేరువయ్యేలా ఉండటం ఆయన ప్రత్యేకతగా వక్తలు పేర్కొన్నారు. ఆయన సాహిత్యాన్ని, కీర్తనలను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కె. లింగమ్మ, సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, ముక్కెర వెంకటనారాయణరెడ్డి, మహిళా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు