సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
18 యూనివర్శిటీల పాలక మండళ్లపై జగన్ హయాం నియామకాలకు చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
అమరావతి: రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ (పాలక మండళ్లు)ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా వ్యవస్థలో పరిపాలనా మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వం 2023 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మూడేళ్ల కాలానికి ఈ పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం క్లాజ్-1 కింద పదవిరీత్యా సభ్యులుగా కొనసాగుతున్న అధికారులు యథావిధిగా కొనసాగనున్నారు. అయితే క్లాజ్-2 కింద ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యుల నియామకాలను రద్దు చేసింది.
అదే సమయంలో కొన్ని విశ్వవిద్యాలయాలకు కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయాల పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నిర్ణయంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నామినేషన్లకు తెరపడగా, కొత్త పాలక మండళ్ల ఏర్పాటుతో ఉన్నత విద్యా సంస్థల పరిపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కొత్త పాలక మండళ్ల నియామకాలపై త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.