నూజివీడు ఎక్సైజ్ కార్యాలయంలో అధికారుల తనిఖీ
నూజివీడు: ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య బుధవారం నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులను పరిశీలించిన అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం నూజివీడు స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల నిర్వాహకులతో రెన్యువల్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూజివీడు స్టేషన్ పరిధిలోని 20 మద్యం దుకాణాలకు రెన్యువల్ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీలోపు రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు. నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేసుకోని దుకాణాలకు సంబంధించి తదుపరి కేటాయింపు ప్రక్రియలో లాటరీ విధానం అమలు చేయనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా “మార్పు” కార్యక్రమాన్ని నూజివీడు సర్కిల్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినట్లు తెలిపారు. సారా తయారీకి పాల్పడుతున్న వారిని గుర్తించి, వారికి అవగాహన కల్పించడం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కార్యక్రమంలో భాగంగా జీవనోపాధి అవసరమున్న 30 మందిని గుర్తించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. వీరిలో పలువురు చేపల పెంపకం, మాంసం దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలు, కిరాణా దుకాణాలు, బడ్డీ కొట్లు తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్నట్లు వెల్లడించారు.
అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని చట్టబద్ధమైన మార్గాల్లో జీవనోపాధి పొందాలని కోరారు.