20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు... బాలవారి గూడెం రోడ్డు అభివృద్ధికి మహర్దశ
20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు... బాలవారి గూడెం రోడ్డు అభివృద్ధికి మహర్దశ
చింతలపూడి, ఆగస్టు 4: చింతలపూడి పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని బాలవారి గూడెం రహదారి ఎట్టకేలకు అభివృద్ధి బాట పట్టింది. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రహదారి అభివృద్ధి కోసం శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ చేసిన కృషి ఫలించడంతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉర్లగూడెం గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు శాసనసభ్యుడిని కలిసి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బాలవారి గూడెం రహదారి అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయని, ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు పనులు ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
కాగా, బుధవారం (ఆగస్టు 5) ఉదయం 11 గంటలకు బాలవారి గూడెం రహదారి అభివృద్ధి పనులకు శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.