నేర దర్యాప్తులో కీలకంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనం
అన్నమయ్య జిల్లా, మదనపల్లె:
నేర దర్యాప్తులో సాక్ష్యాలను సేకరించేందుకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. డీజీపీ మంజూరు చేసిన ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం మదనపల్లెలో ప్రారంభించారు.
అనంతరం వాహనాన్ని క్లూస్ టీమ్ ఇన్చార్జ్ సునీల్కు అప్పగించారు. నేరం జరిగిన ప్రదేశంలోనే ఆధారాలను సేకరించి, వాటిని శాస్త్రీయంగా పరిశీలించేందుకు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు.
వాహనంలో సుమారు 10 రకాల ఫోరెన్సిక్ కిట్లు, హై-ఇంటెన్సిటీ లైట్లు, డీఎన్ఏ సంబంధిత పరికరాలు తదితర సదుపాయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నేర ఘటనలకు సంబంధించిన ఆధారాలను వేగంగా సేకరించి దర్యాప్తులో వాటిని ఉపయోగించేందుకు ఈ వాహనం సహకరించనుంది.
ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. నేరస్తులు ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినా శాస్త్రీయ పద్ధతుల్లో ఆధారాలను గుర్తించి దర్యాప్తు చేపడతామని తెలిపారు. నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, కేసుల దర్యాప్తును పకడ్బందీగా పూర్తి చేసేందుకు ఫోరెన్సిక్ సాంకేతికతను వినియోగిస్తామని పేర్కొన్నారు.
నేర దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడం ద్వారా కేసుల్లో శాస్త్రీయ ఆధారాల సేకరణకు మరింత అవకాశం కలుగుతుందని పోలీసులు తెలిపారు.