2028లో బీజేపీ అధికారమే లక్ష్యం
2028లో బీజేపీ అధికారమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే యెండల
మంచిర్యాల : వచ్చే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే పార్టీని బలోపేతం చేయవచ్చని, రాబోయే ఎన్నికలకు క్యాడర్ను సన్నద్ధం చేయడానికే ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లితో పాటు ముఖ్య నాయకులు కన్నం యుగదీశ్వర్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు