నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకుపోయే ప్రమాదం: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తై, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులు వచ్చే వరకు మూడు బ్యారేజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించబోమని స్పష్టం చేశారు.
మేడిగడ్డలోని కన్నెపల్లి పంప్హౌస్ను వెంటనే ప్రారంభించి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. పంపులను నడిపే పరిస్థితి లేదని, మూడు బ్యారేజీల నిర్వహణను నిలిపివేయాలని ఎన్డీఎస్ఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
మూడు బ్యారేజీల పునాదుల్లో నిర్మాణ లోపాలు, సీపేజ్, పైపింగ్, స్టిల్లింగ్ బేసిన్ల బలహీనత, ఎనర్జీ డిసిపేషన్ వ్యవస్థల్లో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీలోని బ్లాక్-7 పునాదుల కింద ఖాళీలు ఏర్పడటంతో అది కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు.
అవసరమైన మరమ్మతులు చేయకుండా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, భద్రాచలం సహా దిగువ ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. ఇది రాజకీయ అంశం కాదని, ప్రజల భద్రతకు సంబంధించిన ఇంజినీరింగ్ సమస్య అని పేర్కొన్నారు.
మూడు బ్యారేజీల్లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, బోర్హోల్ పరీక్షలు, హైడ్రాలిక్ మోడలింగ్, డిజిటల్ ట్విన్ సిమ్యులేషన్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అధ్యయనాలు సీడబ్ల్యూపీఆర్ఎస్ పుణె, ఏఎఫ్ఆర్వై, ఐఐటీ బాంబే సంస్థలు ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో చేపడుతున్నాయని చెప్పారు.
వరదలు తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించి, 2027 జూలై-ఆగస్టు నాటికి మూడు బ్యారేజీల పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అప్పటి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఫ్రీ-ఫ్లో స్థితిలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు.