తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. క్రిస్టియన్ మైనార్టీలకు ఉచితంగా బైక్లు, స్కూటీలు
తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల ఆర్థిక సాధికారత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో బైక్లు, స్కూటీలు, ఈ-స్కూటీలు, కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం కొత్త ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మహిళలు, యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, మోటార్ బైక్లు, స్కూటీలు, ఈ-స్కూటీలు, చిన్న వ్యాపార యూనిట్లు అందజేయనున్నారు.
దరఖాస్తులు ఎప్పటి వరకు?
ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ జూలై 3 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు జూలై 18 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన TS OBMMS పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
అర్హతలు ఇవే..
పట్టణ ప్రాంతాల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
గ్రామీణ ప్రాంతాల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించకూడదు.
కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
బైక్లు, స్కూటీలు, ఈ-స్కూటీల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపింది. అర్హత ప్రమాణాల పరిశీలన అనంతరం మాత్రమే ఎంపిక ప్రక్రియ చేపడతారు. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలనుకునే యువత, మహిళలకు ఈ పథకం మంచి అవకాశంగా అధికారులు పేర్కొంటున్నారు.
పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. సందేహాల నివృత్తి కోసం 040-23391067 హెల్ప్లైన్ను సంప్రదించవచ్చు.
ఈ పథకం ద్వారా క్రిస్టియన్ మైనార్టీ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బైక్లు, స్కూటీలు, చిన్న వ్యాపార యూనిట్లు, కుట్టు మిషన్ల ద్వారా ఆదాయ వనరులు పెంచుకుని ఆర్థికంగా బలోపేతం కావచ్చని అధికారులు తెలిపారు.