www.ntodaynews.com
బెల్ట్ షాపులను అరికట్టాలి: ఎక్సైజ్ జాయింట్ కమిషనర్కు వినతి
తెలంగాణ
జిల్లాలోని గ్రామాల్లో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న అక్రమ బెల్ట్ షాపులను వెంటనే అరికట్టి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని అవినీతి నిర్మూలన సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ అంజన్రావుకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోందని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న బెల్ట్ షాపుల నిర్వాహకులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిర్మూలన సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.