బేగంబజార్లో 48 కిలోల బంగారు గణేశుడు
24 క్యారెట్ల బంగారు పూత.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్తో ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ | Ntoday News
వినాయక చవితి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బేగంబజార్లోని ఫీల్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణేశ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 48 కిలోల బరువున్న ఈ విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు 3,83,800 అమెరికన్ డైమండ్స్తో అలంకరణ చేశారు.
‘లీ-చీ కా రాజా’గా ప్రసిద్ధి చెందిన ఈ గణనాథుడిని అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులు రూపొందించారు. సుమారు ఎనిమిది మంది కళాకారులు ఎనిమిది నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో రాయిని ప్రత్యేకంగా అమర్చినట్లు వెల్లడించారు.
ఈ విగ్రహ రూపకల్పనలో ముంబైలోని లాల్బాగ్చా రాజాతో పాటు తిరుపతి బాలాజీ రూపాల నుంచి స్ఫూర్తి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వెనుక భాగంలో దశావతారాల రూపకల్పనతో పాటు పైభాగంలో బాలాజీ రూపం, ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతి రూపాలను పొందుపరిచారు.
బంగారు పూత, వేలాది మెరుస్తున్న అమెరికన్ డైమండ్స్తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ విగ్రహం బేగంబజార్లో వినాయక చవితి వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.