50 ఏళ్ల తరువాత డీలిమిటేషన్కు రంగం సిద్ధం..!
50 ఏళ్ల తరువాత డీలిమిటేషన్కు రంగం సిద్ధం..! మహిళా రిజర్వేషన్ల అమలుకు కీలక అడుగు
న్యూఢిల్లీ, మార్చి 25: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. దాదాపు ఐదు దశాబ్దాల తరువాత చేపట్టనున్న ఈ ప్రక్రియతో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ముఖ్యంగా ఛట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు ఇది కీలకంగా మారింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య, వాటి పరిధులను పునర్నిర్మించే ఈ ప్రక్రియ రాజ్యాంగం ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సి ఉన్నప్పటికీ, గతంలో పలుమార్లు వాయిదా పడింది. స్వాతంత్ర్యం తరువాత 1952లో మొదటిసారి డీలిమిటేషన్ నిర్వహించగా, తరువాత 1963, 1973లో మరో రెండు సార్లు చేపట్టారు. 1973 నాటికి లోక్సభ సీట్లు 543కు పెరిగాయి. రాష్ట్రాల మధ్య జనాభా అసమానతల కారణంగా 1976లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం డీలిమిటేషన్ను 25 ఏళ్లపాటు నిలిపివేసింది. అనంతరం పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం మరో 25 ఏళ్లపాటు, అంటే 2026 వరకు ఈ ప్రక్రియను నిలిపివేసింది. మధ్యలో 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, సీట్ల సంఖ్యను పెంచకుండా కేవలం నియోజకవర్గాల పరిధులను మాత్రమే మార్చి 2008లో తుది ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మళ్లీ ప్రారంభమవుతున్న ఈ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణలో ముందున్న ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉండగా, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే దక్షిణ రాష్ట్రాలకు నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త ఫార్ములాను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా సుమారు 50 శాతం సీట్లు పెంచి, 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే యోచనలో ఉంది. 2026 తరువాత ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 2029 ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చే అవకాశముండడంతో దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.