www.ntodaynews.com
ఖైదీలా బతికా.. అందుకే కడతేర్చా: బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితురాలి సంచలన వ్యాఖ్యలు
జాతీయం
బెంగళూరులో తల్లిదండ్రులు, చెల్లెలిని హత్య చేసి అరెస్టైన నిందితురాలు శ్వేత (25) కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కృష్ణరాజపురం పోలీసుల ఆధ్వర్యంలో ఆమెను తీవ్రంగా విచారిస్తున్నారు.
పుదుచ్చేరిలో అరెస్టు చేసిన శ్వేతను బెంగళూరుకు తీసుకొచ్చిన పోలీసులు, 47వ ఏసీజేఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమెను వారం రోజులపాటు పోలీసు కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
విచారణలో శ్వేత సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తాను చిన్నప్పటి నుంచి "ఖైదీలా జీవించానని, స్వేచ్ఛగా ఉండేందుకు కుటుంబం అవకాశం ఇవ్వలేదని" ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే కేసులో శ్వేతతో సహజీవనం చేస్తున్న కెనెత్ను కూడా పోలీసులు పుదుచ్చేరిలోని అణ్ణాసాలై సమీపంలో గుర్తించి, ఓర్లియన్పేట పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల వెనుక ఉన్న పూర్తి కారణాలు, కెనెత్ పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.