ఆరుగోలనుపేటలో ఘనంగా అన్నసమారాధన.. భక్తుల సందడి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగోలనుపేట గ్రామంలోని గౌడ్ బజార్లో వినాయక నవరాత్రుల సందర్భంగా శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అన్నసమారాధనకు భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 2,000 మందికి కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని అందించారు. భక్తిశ్రద్ధలతో సాగిన అన్నసమారాధనతో గౌడ్ బజార్ ప్రాంతం సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా అన్నసమారాధన నిర్వహించడం ఆనందంగా ఉందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.