ఆస్తుల కోసం కన్నతండ్రినే బయటకు పంపించిన కుటుంబం..!
ఆస్తుల కోసం కన్నతండ్రినే బయటకు పంపించిన కుటుంబం..!
వృద్ధుడి దయనీయ స్థితి చూసి స్పందించిన స్థానికులు
చాకచక్యంగా స్పందించిన మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పశువుల ఆస్పత్రి సమీపంలో అవ్వారు నాగేశ్వరరావు అనే వృద్ధుడు నిరాశ్రయ స్థితిలో ఒంటరిగా కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆకలితో, ఆవేదనతో అక్కడే కూర్చున్న వృద్ధుడిని గమనించిన సచివాలయ పోలీసు సిబ్బంది, నవులూరు టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నజీర్ వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆస్తులన్నీ తమ పేర్లకు రాయించుకుని అనంతరం ఇంటి నుంచి బయటకు పంపించినట్లు నాగేశ్వరరావు తెలిపినట్టు సమాచారం.
ఈ విషయంపై స్పందించిన ఎస్సై వెంకట్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వృద్ధులను చూసుకోవడం కుటుంబ సభ్యుల బాధ్యత అని, ఆస్తుల కోసం వారిని వేధించడం అమానుషమని హెచ్చరించారు. అనంతరం నాగేశ్వరరావును సురక్షితంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.
ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ మాట్లాడుతూ…
“వృద్ధులను నిర్లక్ష్యం చేయడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కుటుంబ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలి” అని సూచించారు.