ఏలూరు జిల్లాలో సహకార బ్యాంకులో రూ.1.44 కోట్ల గోల్మాల్..? మక్కినవారిగూడెం సొసైటీలో కలకలం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, టి.నర్సాపురం మండలం: టి.నర్సాపురం మండలంలోని మక్కినవారిగూడెం సహాయ సహకార బ్యాంకులో సుమారు రూ.1.44 కోట్ల నిధులు గోల్మాల్ అయినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ఈ వ్యవహారంపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు సొసైటీ అధ్యక్షుడు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అభ్యంతరం వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై యుద్ధ ప్రాతిపదికన సమగ్ర విచారణ చేపడితే నిధుల గోల్మాల్ అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, సొసైటీలో గతంలో కార్యదర్శి విధులు నిర్వహించిన వ్యక్తి స్థానంలో అనుభవం లేని వ్యక్తిని విధుల్లోకి తీసుకుని, చివరి దశలో అదే వ్యక్తిపై ఆరోపణలు మోపడం వెనుక అసలు కారణాలేంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, గతంలో చింతలపూడి మండలం పోతునూరు సహకార సొసైటీలో కార్యదర్శి ఆత్మహత్య ఘటన మరువకముందే, ఇప్పుడు మక్కినవారిగూడెం సొసైటీ వ్యవహారం మరోసారి సహకార శాఖ పనితీరుపై చర్చకు దారి తీసింది.
అయితే, రూ.1.44 కోట్ల గోల్మాల్కు సంబంధించి అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.