డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసిన చంద్రబాబు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు, జూలై 7: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్లు, శవాల మాయం వంటి అరాచకాలు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు.
‘రావణ్’ అరెస్ట్ డ్రామాతో వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం
సాయికృష్ణ, క్రాంతికుమార్ వంటి కస్టోడియల్ మరణాలపై వైఎస్సార్సీపీ చట్టాన్ని, పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే, వాటిపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘రావణ్’ అరెస్ట్ డ్రామాకు తెరలేపిందని కాకాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు లోపాలు, శాంతిభద్రతల సమస్యల నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే ఈ కొత్త రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రావణ్తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు
రావణ్ను తమ పార్టీకి చెందిన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, కానీ ఆయనతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని కాకాణి స్పష్టం చేశారు. గతంలో ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని, అదే సమయంలో టీడీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టారని, బాలకృష్ణను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఏడాది క్రితమే హిందూయిజం, సెక్యులరిజంపై కూడా పోస్టులు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అకస్మాత్తుగా ఒక పార్టీకి అంటగట్టడం రాజకీయ కుట్రేనన్నారు.
ఉగ్రవాద చట్టాలతో ప్రతిపక్షాన్ని అణచివేయాలని కుట్ర
సాధారణ రాజకీయ విమర్శలు చేసే యూట్యూబర్పై ఉగ్రవాదులకు వర్తించే యూఏపీఏ (UAPA) చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమని కాకాణి మండిపడ్డారు. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి విచారణ జరపడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ తీవ్రవాద చట్టాలను రాజకీయ కక్ష సాధింపుకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా యూఏపీఏ చట్టం ప్రయోగంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, దానిని మసిపూసి మారేడుకాయ చేయడానికి చంద్రబాబు మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు. గతంలో సెక్షన్ 111, ఇప్పుడు యూఏపీఏ చట్టాలను ప్రయోగిస్తూ రేపు ప్రతిపక్షంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందనే భయాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ను రాజకీయంగా వాడుకుంటున్న చంద్రబాబు
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో తాము పోలీసు వ్యవస్థను, చట్టాన్ని మాత్రమే ప్రశ్నించామని, ఎక్కడా ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదని కాకాణి పేర్కొన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీపై విరుచుకుపడుతున్నారని, దీనివెనుక చంద్రబాబు రాజకీయ వ్యూహం ఉందని ఆరోపించారు.
ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను "వైఎస్సార్సీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్"గా మార్చి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని, ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ను ముందుకు నెట్టి తండ్రీకొడుకులు రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
సోషల్ మీడియా కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం
రావణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే అవి ఏడాది క్రితం చేసినవని, ఇంతకాలం ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించిందని కాకాణి ప్రశ్నించారు. కేవలం పవన్ కళ్యాణ్ను విమర్శించాడనే కారణంతో ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టడం, ఐదు రోజుల్లో ఐదు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం చట్ట దుర్వినియోగమేనన్నారు.
సోషల్ మీడియా కార్యకర్తలను, ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు దీనిని ఒక మోడల్గా వాడుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
చంద్రబాబుకు దేవుడిపై నిజమైన భక్తి లేదు
చంద్రబాబుకు దేవుడిపై నిజమైన భక్తి, భయం లేవని కాకాణి వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ అంశంపై అపవిత్రమైన వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఆలయాల కూల్చివేతలు, హుండీ దొంగతనాలు, తొక్కిసలాటల్లో భక్తులు మృతి చెందిన ఘటనల్లో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు.
మహిళలను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం చంద్రబాబు భక్తికి నిదర్శనమని ఆరోపించిన ఆయన, సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కేసుల్లో ప్రభుత్వం ఎందుకు పురోగతి సాధించలేదని ప్రశ్నించారు.
కోటంరెడ్డి రాజకీయ ప్రసంగాలు మానుకోవాలి
నెల్లూరు ఎమ్మెల్యే రాజకీయ ప్రసంగాలు పక్కనబెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కాకాణి సూచించారు. చంద్రబాబుపై భక్తి ప్రదర్శిస్తూ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివి జిల్లాలో అభాసుపాలు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.
చివరగా ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు మానుకుని రాష్ట్రంలో జరుగుతున్న లాకప్ డెత్స్, శాంతిభద్రతల వైఫల్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.