తిరువూరులో ఆటో డ్రైవర్లకు ఎస్సై రాజు కౌన్సెలింగ్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, జూలై 7: పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరువూరు సెక్టర్-2 ఎస్సై రాజు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆటో డ్రైవర్లతో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రాష్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రతి డ్రైవర్ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములని, చిన్న సమాచారం కూడా పెద్ద నేరాలను అరికట్టడంలో కీలకంగా మారుతుందని ఎస్సై రాజు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.