తిరుమల బ్రహ్మోత్సవాలకు సిద్ధం.. 50 ఎలక్ట్రిక్ బస్సులతో భక్తులకు మెరుగైన సేవలు
తిరుమలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందిస్తున్న 25 ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం తదితర అంశాలపై తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో రిలయన్స్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న 15 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మరో 10 బస్సులను కలుపుకుని మొత్తం 50 బస్సుల సామర్థ్యానికి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకేసారి 20 బస్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లు, 2 మెగావాట్ల సామర్థ్యంతో ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రతి బస్సులో 50 మంది భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, బస్సుల్లో ఆధునిక ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి తదుపరి బస్టాప్ వివరాలు డిజిటల్ రూపంలో కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే 50 మంది నిపుణులైన డ్రైవర్లను సిద్ధం చేసి, ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా రెండు షిఫ్టుల్లో 50 బస్సులను నడిపే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బస్సుల పార్కింగ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బ్రహ్మోత్సవాలకు ముందే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.