విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్
సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆశా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ హాజరై, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా కమల్ ఫాషాతో కలిసి విద్యార్థులకు నోటుబుక్స్, బ్యాగులు, యూనిఫామ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని, కళాశాలతో తనకున్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. అధ్యాపకులు బోధించే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరచాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని మెరుగుపరిచి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా కమల్ ఫాషా, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.