సచివాలయం ఎదుట ఉద్యోగుల నిరసన
పీఆర్సీ, డీఏ బకాయిలు, ప్రమోషన్లపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఉద్యోగులు నిరసనకు దిగారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమై తమ సమస్యలను వెల్లడించారు.
ఉద్యోగులకు పీఆర్సీ లేక మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత మే 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్యలపై సానుకూలంగా స్పందించినప్పటికీ, ఆ సమావేశం జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
గత ఏడాది నుంచి ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా కల్పించడం లేదని, దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. హెల్త్ కార్డులు లేక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓపీఎస్ (పాత పెన్షన్ విధానం) తీసుకొస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. అలాగే ఆరు డీఏలు బకాయిలు ఉన్నాయని తెలిపారు.
ప్రతి నెల జీతం చెల్లించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, సచివాలయ ఉద్యోగులు సైతం తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.
‘నేటి ఆందోళన ప్రారంభం మాత్రమే’
ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నేటి ఆందోళన ప్రారంభం మాత్రమేనని, సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
‘మావి గొంతెమ్మ కోరికలు కావు’
టీజీఎస్ఏ జనరల్ సెక్రటరీ ప్రేమ్ దేవేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని కోరుతూ తాము ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. తమ డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలేనని పేర్కొన్నారు.
ఉద్యోగులు ప్రభుత్వాన్ని భయపెడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. డీఏల బకాయిల విషయంలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని విమర్శించారు. ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు.
ప్రమోషన్లు రాకుండా ఉన్నతాధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించిన ఆయన, ఉద్యోగులకు ఇళ్ల కేటాయింపు కూడా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ, డీఏల బకాయిలు, ప్రమోషన్లు, హెల్త్ కార్డులు, ఓపీఎస్ తదితర అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు.