కొత్త రేషన్ కార్డుల పంపిణీలో ఎంపీ కడియం కావ్య
స్మార్ట్ రేషన్ కార్డుతో అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు
హనుమకొండ | Ntoday News
హసన్పర్తి మండలంలో నిర్వహించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం ప్రజలు ఎదురుచూశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం తదితర సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా అర్హులైన కుటుంబాలకు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే అవకాశం కలుగుతుందని ఆమె వివరించారు. గతంలో రేషన్ కార్డు ప్రధానంగా ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలకు ఉపయోగపడేదని, ప్రస్తుతం ‘వన్ కార్డు–మెనీ స్కీమ్స్’ విధానంలో ఆరోగ్య సేవలు, రుణాలు, సన్నబియ్యం, విద్యతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందే అవకాశం ఉందన్నారు.
ప్రతి లబ్ధిదారుడు స్మార్ట్ రేషన్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు.
1000 రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎంపీ పిలుపునిచ్చారు.
చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇచ్చినట్లే.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
అక్రమ వసూళ్లపై ఫిర్యాదు చేయాలి
పేదలకు ఇళ్ల మంజూరు, ఇతర సంక్షేమ పథకాల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగినా లేదా మోసాలకు పాల్పడినా వెంటనే ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు.
ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇళ్ల మంజూరు విషయంలో ఎలాంటి అక్రమ వసూళ్లు జరగలేదని అధికారులు స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.