30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్కు జాతికి అంకితం
కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా | యర్రగొండపాలెం | Ntoday News
పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం సాకారం దిశగా మరో కీలక అడుగు పడింది. యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి, ప్రాజెక్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. స్వయంగా నీటిలోకి దిగి కృష్ణమ్మకు హారతి సమర్పించడంతో పాటు పసుపు–కుంకుమలతో చీరను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు రైతులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గంటవానిపల్లి పరిసర ప్రాంతాలు జనసందోహంతో సందడిగా మారాయి.
ముఖ్యమంత్రి జలహారతి కార్యక్రమానికి చేరుకున్న సమయంలో నల్లమల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగం
జలహారతి కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్ట్ కోసం గత మూడు దశాబ్దాలుగా జరిగిన కృషి, నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లు, వివిధ దశల్లో ఎదురైన ఇబ్బందులను వివరించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పశ్చిమ ప్రాంతంలోని రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి అవసరాల విషయంలో గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మూడు దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న రైతులు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్న నేపథ్యంలో కార్యక్రమం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ ప్రారంభంతో తమ ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.