తిరువూరులో మ్యాట్రిస్-4 డ్రోన్తో పోలీసుల ఈగల్ ఛాలెంజ్
మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక నిఘా.. అపోహలు కాకుండా ఆధారాలతో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మాదకద్రవ్యాల నియంత్రణకు తిరువూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజయవాడ కమిషనరేట్ సీపీ ఎస్వీ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ మార్గదర్శకత్వంలో, మైలవరం ఏసీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సోమవారం మ్యాట్రిస్-4 డ్రోన్ ద్వారా నిఘా కార్యక్రమం నిర్వహించారు.
తిరువూరు పట్టణంలోని ఎస్ఆర్ టవర్స్, చీరాల సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై సమాచారం సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఈగల్ ఛాలెంజ్లో భాగంగా..
గంజాయి లేదా ఇతర నిషేధిత మాదకద్రవ్యాలు వినియోగించే వారు, విక్రయించే వారి గురించి కచ్చితమైన సమాచారం అందించాలని పోలీసులు కోరారు. విశ్వసనీయ సమాచారం అందించిన వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
“బ్లేడ్ బ్యాచ్.. గంజాయి బ్యాచ్..” అంటూ ఆధారాలు లేకుండా ఎవరిపైనా అపోహలు కల్పించవద్దని సూచించారు. మద్యం సేవించే వారిని మాదకద్రవ్యాల వినియోగదారులుగా భావించవద్దని, వాస్తవ ఆధారాలతో మాత్రమే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అపోహలు వద్దు.. ఆధారాలు కావాలి.. సమాచారం మీది.. చర్య మా బాధ్యత అంటూ తిరువూరు పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.