జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పోలీసులు
అన్నమయ్య జిల్లా | మదనపల్లె | Ntoday News
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రత, ప్రజల ప్రాణ రక్షణను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, అతివేగం వంటి ఉల్లంఘనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని తెలిపారు.
ప్రజల ప్రాణ రక్షణ, పటిష్టమైన రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు ప్రతిరోజూ నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రహదారి భద్రత కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు తోడ్పడాలని పోలీసులు కోరారు.