అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
• ప్రజల సహకారం, ప్రత్యామ్నాయ వనరుల వినియోగంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.
• ఘన వ్యర్థాల సేకరణ, నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు పాలుపంచుకునేలా ప్రత్యేక విధివిధానాలు రూపొందించండి.
• రోడ్లు, డ్రైనేజ్ లు, పార్కులు, ఆటస్థలాలు, శ్మశానవాటికలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోండి.
• పట్టణాభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రత్తిపాటి సమీక్ష.
పట్టణాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని, వారి ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలని, అదేవిధంగా వ్యర్థాల సేకరణ, నిర్వహణ... పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంలోనూ వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని శాసనభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
బుధవారం ఆయన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణాభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. సమీక్ష అనంతరం ప్రత్తిపాటి పట్టణంలోని 38వ వార్డు, ఎన్టీఆర్ కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించారు.
చేసే అభివృద్ధితో ప్రజల్లో గుర్తింపు.. ప్రభుత్వ కృషికి సార్థకత లభించాలి
పట్టణ సమగ్రాభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రభుత్వం అందించే నిధుల్ని సద్వినియోగం చేసుకోవడంలో, ప్రజల అవసరాలు తీర్చడంలో అన్ని విభాగాలు పోటీపడాలని ప్రత్తిపాటి సూచించారు. నివాసాలున్న చోటే రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టాలని, ప్రజలకు ఉపయోగపడితేనే అధికారుల కష్టం, ప్రభుత్వ కృషికి తగిన గుర్తింపు, సార్థకత లభిస్తాయన్నారు.
రోడ్లు, డ్రైనేజ్ లు, పార్కులు, ఆటస్థలాలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. అన్ని మతాల శ్మశాన వాటికల ఆధునీకరణ పనులు వేగంగా నిర్దేశిత గడువులోపే పూర్తి కావాలన్నారు. తాగునీటి సరఫరాలో తలెత్తే సమస్యలు పదేపదే పునరావృతం కావడానికి వీల్లేదని, ఆర్.డబ్ల్యూఎస్ విభాగం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందాలని, తదనుగుణంగా యంత్రాంగం నిబద్ధత, ముందుచూపుతో పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. రోడ్లపై, కాలువల్లో ఎక్కడా చెత్త కనిపించకూడదని, బాధ్యతరాహిత్యంగా వ్యవహరించే పౌరులు, దుకాణదారుల ఆలోచనల్లో మార్పు వచ్చేలా చూడాలన్నారు.
15వ ఆర్థిక సంఘం, మైనింగ్ గ్రాంట్ నిధులతో బాగా దెబ్బతిన్న రోడ్లు, కాలువల మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోటే కొత్తవి నిర్మించాలని చెప్పారు. అభివృద్ధి పనులు పూర్తయిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
సమీక్ష సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఇ అబ్దుల్ రహీమ్, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, మురకొండ మల్లిబాబు, కొత్త కోటేశ్వరరావు, జంగా వినాయకరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.