ఏఎన్ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం
ఏఎన్ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం
చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు మన్నెమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏఎన్ఎం పోస్టుకు మెరిట్లో అర్హత సాధించినప్పటికీ, నాన్-లోకల్ కారణంతో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపింది.
ఎస్.ఆర్.పురం మండలం ఉప్పరపల్లికి చెందిన మన్నెమ్మ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించగా, అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు వెంటనే అడ్డుకుని ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మన్నెమ్మ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మద్దివలస. 2013లో ఎస్.ఆర్.పురంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం భర్త వదిలి వెళ్లిపోయాడని, కష్టపడి చదివి మెరిట్లో అర్హత సాధించినా ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఏఎన్ఎం మెరిట్ జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ, నాన్-లోకల్గా పరిగణించి తొలగించారని ఆరోపిస్తూ తీవ్ర నిరాశతో ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.