ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రద్దీ ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, శీతలీకరణ షెల్టర్లు, నీడ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు తరచూ నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.