ఏలూరు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, జూలై 28: జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్తో కలిసి ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.
గత ఏడాది జిల్లాలో 304 రహదారి ప్రమాదాలు చోటుచేసుకుని 149 మంది ప్రాణాలు కోల్పోయారని కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాలు, మరణాలు తగ్గినా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందన్నారు. అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.
జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశానికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరుకాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, వారి నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ అన్ని పాఠశాల బస్సుల్లో తప్పనిసరిగా డాష్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై అతివేగంగా వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు, రహదారులపై వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక కాంతి వెదజల్లే లైట్లు అమర్చిన వాహనాలు, వాటిని విక్రయించే దుకాణాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో రవాణా శాఖ ఉప కమిషనర్ కరీం గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్టీవో ఎస్.బి. శేఖర్, డీపీవో మల్లికార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.