ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముండటంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి.
విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఈదురు గాలుల తీవ్రత కొనసాగనుండగా, సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సమయంలో చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.