ఏపీలో ఎల్లుండి (జూలై 8) నుంచి 'సదరం' స్లాట్ బుకింగ్ ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు ప్రభుత్వం మరోసారి 'సదరం' సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. సదరం సర్టిఫికెట్ల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 8 నుంచి ప్రారంభమై ఆగస్టు చివరి వరకు కొనసాగనుంది.
అర్హులైన దివ్యాంగులు తమ సమీపంలోని మీ-సేవ కేంద్రాలు లేదా గ్రామ సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. జూలై 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం అర్హత కలిగిన వారికి సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు సదరం విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రయాణ భారం తగ్గించేందుకు రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, లబ్ధిదారులు తమ సొంత జోన్లోనే వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సదరం సర్టిఫికెట్లు పొందాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సర్టిఫికెట్ల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్, విద్యా, ఉపాధి మరియు ఇతర రాయితీలను పొందే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.