సి.గుడిపాడులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి ప్రోత్సాహక నగదు బహుమతులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులను ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విశ్వభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సి.గుడిపాడు గ్రామానికి చెందిన, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డి. ఉపేందర్ రెడ్డి విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు.
పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన ఆకూటి దుర్గా భవాని (522 మార్కులు)కు రూ.10,000, రెండో ర్యాంకు సాధించిన కోటి అభినయ (519 మార్కులు)కు రూ.2,000, మూడో ర్యాంకు సాధించిన కఠారి శ్రావణి (493 మార్కులు)కు రూ.1,000 చొప్పున నగదు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ డి. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని, సమాజానికి ఆదర్శంగా నిలిచేలా ఉన్నత స్థానాలను చేరుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చాట్రాయి మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీనివాసరావు, వి.ఎస్.వి. బ్రహ్మాచారి మాట్లాడుతూ, విద్యార్థుల కృషిని గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.
విశిష్ట అతిథిగా హాజరైన చాట్రాయి మండల వైస్ ఎంపీపీ పుచ్చకాయల సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ విద్యాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చిట్టిబాబు తదితరులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.