జీవో 396 రద్దు చేయాలంటూ విస్సన్నపేటలో దస్తావేజు లేఖర్ల పెన్డౌన్.. సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటలో దస్తావేజు లేఖర్లు, స్టాంపు విక్రేతలు సోమవారం పెన్డౌన్ కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెం.396ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే విధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది దస్తావేజు లేఖర్లు, స్టాంపు విక్రేతలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 396ను వెంటనే ఉపసంహరించుకుని తమ ఉపాధికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నిరసన అనంతరం దస్తావేజు లేఖర్లు, స్టాంపు విక్రేతలు కలిసి ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఆళ్ళ.నాగ మోహన్కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో,పోతుల శ్రీనివాస రావు, రామకృష్ణ, కేతేపల్లి విజయశేఖర్, అబ్బినేని రమేష్, గోనెల దిలీప్, నూతక్కి శ్రీనివాసరావు, మహేశ్వర రావు, జ్యోతి తదితర దస్తావేజు లేఖర్లు, ఇన్నయ్య, సుజాత తదితర స్టాంపు విక్రేతలు, సహాయకులు పాల్గొన్నారు.