గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం.. దెందులూరు క్రీడాభివృద్ధిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక దృష్టి
దెందులూరు నియోజకవర్గ రిపోర్టర్ పులువర్తి సంతోష్
దెందులూరు/విజయవాడ, జూలై 06: గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
సోమవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) కార్యాలయంలో సాప్ చైర్మన్ రవి నాయుడుతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సాప్ చైర్మన్ పూల గుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి, యువతకు మెరుగైన శిక్షణ అందించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
గ్రామీణ ప్రాంత యువతలో అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, సరైన ప్రోత్సాహం, శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు తీసుకురాగలరని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. అందుకోసం నియోజకవర్గంలో మరిన్ని క్రీడా పోటీలు, శిక్షణ శిబిరాలు, ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని సాప్ చైర్మన్ను కోరారు.
దీనిపై సాప్ చైర్మన్ రవి నాయుడు సానుకూలంగా స్పందిస్తూ, దెందులూరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలతో పాటు, గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.
క్రీడలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతో పాటు యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించవచ్చని ఈ సందర్భంగా ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు.