ఏపీలో మళ్లీ కొవిడ్ కలకలం.. 12 కేసులు నమోదు, నలుగురు మృతి
ఏపీలో మళ్లీ కొవిడ్ కలకలం.. 12 కేసులు నమోదు, నలుగురు మృతి
అమరావతి: రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు మొత్తం 12 కొవిడ్-19 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో చెరో ఒక కేసు గుర్తించారు. ఇదే కాలంలో కొవిడ్ పాజిటివ్తో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఐదు నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ కోసం పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు చెదురుమదురుగానే నమోదవుతున్నాయని, ఎలాంటి క్లస్టర్లు గుర్తించలేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ముగ్గురు హోం ఐసోలేషన్లో ఉండగా, ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి మొత్తం 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.