ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి మంచోడు మణిపై దాడి..
ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి మంచోడు మణిపై దాడి.. ఆస్పత్రిలో పరామర్శించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం బోర్వంచ గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యదర్శి బేతమాల మణిరత్నం (మంచోడు మణి)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, నిన్న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో సెయింట్ పౌల్స్ సెమినరీ సమీపంలో కాపుకాచి ఉన్న దుండగులు ముందుగా కారుతో ఢీకొట్టి కిందపడేసి, అనంతరం కాళ్లపై కారును ఎక్కించి రాడ్లు, కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన మంచోడు మణిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
దాడి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అధికారులను కోరారు.