చాట్రాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 6,400 నోటు పుస్తకాల పంపిణీ
చాట్రాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 6,400 నోటు పుస్తకాల పంపిణీ
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులకు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా సంయుక్తంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాట్రాయిలో నిర్వహించిన కార్యక్రమంలో బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ విసిరెడ్డి బాలకోటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా విసిరెడ్డి బాలకోటరెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ఎంతో సంతృప్తినిస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల విద్యాశాఖ అధికారి-2 వి.ఎస్.వి. బ్రహ్మచారి మాట్లాడుతూ, చాట్రాయి వంటి మారుమూల మండలాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నోటు పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గత సంవత్సరం రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో ఎంఆర్సీ చాట్రాయికి సౌండ్ సిస్టమ్ను అందించారని, వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మండలంలోని 1,269 మంది విద్యార్థులకు మొత్తం 6,400 నోటు పుస్తకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు చక్రవర్తి రెడ్డి, కార్యదర్శి వెంకటరెడ్డి, డైరెక్టర్ (సర్వీస్ ప్రాజెక్ట్స్) అభిషేక్ రెడ్డి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లక్ష్మి విసిరెడ్డి, రొటేరియన్ వజ్రాల రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు డి. కృష్ణయ్య, ఎం. అప్పారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జి. అమరయ్య, ఎస్. నరసింహారావు, బి.సి.హెచ్. రాంబాబు, టి. రామారావు, సి.హెచ్. రఘు, జి. సంజీవ్ కుమార్, కె. శేఖర్తో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.