ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో మంగళవారం మృతి చెందడం కలకలం రేపింది.
మృతుల్లో ఒకరికి 43 సంవత్సరాలు, మరొకరికి 60 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరికీ నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో, తుది నిర్ధారణ కోసం రక్త నమూనాలను పుణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
43 ఏళ్ల వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 60 ఏళ్లు పైబడిన మరో వ్యక్తి తమిళనాడులోని సీఎంసీ వెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.