తెలంగాణలో 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) భర్తీ చేయనుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ అనుమతి లభించడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీఎస్ఆర్టీసీలో ఎక్కువగా ఔట్సోర్సింగ్ విధానంలోనే కండక్టర్లను నియమించగా, ఇప్పుడు ప్రభుత్వ అనుమతితో 1,500 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు ప్రారంభించింది.
త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్లో విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం శుభవార్తగా మారింది.