తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. రూ.10తో మీసేవలోనే యూరియా బుకింగ్
తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ శుభవార్త తెలిపింది. స్మార్ట్ఫోన్ లేకపోయినా లేదా ఫర్టిలైజర్ యాప్ వినియోగించలేకపోయినా ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియాను సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
కేవలం రూ.10 సేవా రుసుము చెల్లించి రైతులు సమీప మీసేవ కేంద్రంలో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు.
బుకింగ్కు అవసరమైన వివరాలు:
పట్టాదార్ పాస్బుక్ నంబర్
ప్రస్తుత సాగు విస్తీర్ణం
సాగు చేస్తున్న పంట వివరాలు
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
మీసేవ ఆపరేటర్ వివరాలను నమోదు చేసిన అనంతరం రైతు మొబైల్కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించగానే బుకింగ్ పూర్తై ప్రత్యేక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది.
48 గంటల్లో యూరియా తీసుకోవాలి
బుకింగ్ చేసిన తేదీని మినహాయించి, ఆ తర్వాత 48 గంటల వరకు మాత్రమే బుకింగ్ ఐడీ చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా రైతులు తమకు కేటాయించిన డీలర్ లేదా సహకార సంఘం వద్ద బుకింగ్ ఐడీ చూపించి యూరియా తీసుకోవాలి. గడువు ముగిస్తే బుకింగ్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది.
సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.