ఏలూరులో శబ్ద కాలుష్యంపై పోలీసుల ఉక్కుపాదం
50 మోడిఫైడ్ సైలెన్సర్లు, 15 స్పీకర్ బాక్సులు, 225 ఎల్ఈడీ లైట్లు స్వాధీనం
ఏలూరు నగరంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున మోడిఫైడ్ సైలెన్సర్లు, స్పీకర్ బాక్సులు, డిజైనర్ ఎల్ఈడీ లైట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. లక్ష్మణరావు మరియు సిబ్బంది నగరంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టారు.
ఈ డ్రైవ్లో సుమారు 50 మోడిఫైడ్ మోటార్సైకిల్ సైలెన్సర్లు, 15 స్పీకర్ బాక్సులు, 225 ఎల్ఈడీ (LED) డిజైనర్ లైట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా వాహనాలకు డిజైనర్ ఎల్ఈడీ లైట్లు, శబ్ద కాలుష్యానికి కారణమయ్యే మోడిఫైడ్ సైలెన్సర్లు, భారీ స్పీకర్ బాక్సులు అమర్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ట్రాఫిక్ చట్టాలతో పాటు బి.ఎన్.ఎస్. (BNS) నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అక్రమంగా ఇటువంటి సామగ్రిని విక్రయించే దుకాణాల యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
నగరంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు తమ వాహనాల్లో ఎటువంటి అనధికార మార్పులు చేయకుండా, ఫ్యాక్టరీ ప్రమాణాలకే కట్టుబడి ఉండాలని సూచించారు.
నిబంధనలు అతిక్రమించే వారిపై వాహనాల స్వాధీనం, భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.