భగవానుపురంలో గోమాత ఫోటోల పంపిణీ
గంపలగూడెం మండలంలో ఇప్పటివరకు 170 గోమాత ఫోటోలు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు శివారు గ్రామమైన భగవానుపురంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. గోవును పూజించడం అంటే సకల దేవతలను పూజించినట్లేనని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గోవును పూజించే అవకాశం లేని వారు గోమాత ఫోటోను ఇంట్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజించవచ్చని తెలిపారు.
అనంతరం పెనుగొలను శిరిడి సాయిబాబా మందిరంలో కూడా భక్తులకు గోమాత ఫోటోలు పంపిణీ చేశారు. గంపలగూడెం మండలానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు అందజేసిన 170 గోమాత ఫోటోలను మండలంలోని వివిధ గ్రామాల భక్తులకు ఇప్పటికే పంపిణీ చేసినట్లు శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు వెల్లడించారు.